రైల్లో టిక్కెట్టు లేని ప్రయాణం, ఫుట్బోర్డింగ్ చేయడం వంటి చిన్ని చిన్ని నేరాలకు ఇంతకాలం విధిస్తున్న జైలు శిక్షను రద్దు చేసేందుకు రైల్వే శాఖ యోచిస్తున్నట్టు సమాచారం. ఇటువంటి నేరాల విషయంలో కేవలం జరిమానాలతోనే సరిపెడదామనే ఆలోచనలో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. కోర్టులు, పౌరులపై భారం తొలగించేందుకే ఈ సమాలోచన జరుపుతున్నట్టు తెలుస్తోంది. రైల్వే స్టేషన్ పరిసరాల్లో భిక్షాటన చేయాడాన్ని నేరంగా పరిగణించకూడదనే ప్రతిపాదన కూడా రైల్వే శాఖ పరిశీలనలో ఉంది.
రైల్వే చట్టంలోని అనేక నిబంధనలను ఆ శాఖ సమీక్షిస్తోందని, కోర్టులపై భారం తగ్గించడంతో పాటూ పౌరుల సౌకర్యార్థం చిన్ని చిన్న నేరాలకు అప్పటికప్పుడు జరిమానాలు విధించేందుకు అనువైన పరిస్థితిని కల్పించేందుకు రైల్వే శాఖ ప్రయత్నిస్తోందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న నిబందనల ప్రకారం రైల్లో లేదా రైల్వే స్టేషన్లో జరిగిన నేరాలకు జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. తాజా ప్రతిపాదనకు అంగీకారం లభిస్తే.. రైల్లో అనవసరంగా చైన్ లాగడం, టిక్కెట్టు లేని ప్రయాణం, వంటి నేరాలకు జైలు శిక్ష లేకుండా కేవలం జరిమానా మాత్రమే విధించే అవకాశం ఉంది.