జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో హిట్లర్ పాలన సాగుతోందని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముందు పుట్టి ఉంటే హిట్లర్ పేరు ప్రపంచానికి తెలిసేది కాదన్నారు. ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ రెడ్డి అరాచకప్రదేశ్గా మార్చారని ధ్వజమెత్తారు. టీడీపీ నాయకుల అక్రమ అరెస్టులతో తమ అధినేత చంద్రబాబును భయపెట్టలేరన్నారు. 2024లో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. దుర్యోధనుడికి 100 మంది సోదరులు ఉన్నట్లు.. జగన్కి 151 మంది ఉన్నారని వ్యాఖ్యానించారు. అయినా ధర్మం ధర్మరాజు అయిన చంద్రబాబుతోనే ఉందని పేర్కొన్నారు. మహానాడులో చంద్రబాబు బీసీలకు అధిక ప్రాధాన్యమివ్వడంతో.. వారిని టీడీపీకి దూరం చేయాలనే దురాలోచనతో జగన్ వ్యవహరిస్తున్నారని బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నిండా దొంగలు, దోపిడీదారులు, ఎర్రచందనం స్మగ్లర్లు, బెట్టింగ్ రాయుళ్లే ఉన్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్పై నోటికొచ్చినట్లు పేలుతున్న నాయకులు.. టీడీపీ అధికారంలోకి రాగానే 70 ఎంఎం సినిమా మొదలవుతుందని వెంకన్న హెచ్చరించారు.