దేశంలో కొన్ని రోజుల నుంచి వరుసగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిపోతోన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో మాత్రం వాటి పెరుగుదలపై సినీనటుడు, ఎంఎన్ఎం అధ్యక్షుడు కమలహాసన్ మండిపడ్డారు. కరోనా నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశ ప్రజలపై మరింత భారాన్ని వేసేలా కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయని విమర్శించారు.
గతంలో కేంద్ర ప్రభుత్వం ముడి చమురు ధరల పెరుగుదలను కారణంగా పెట్రో ధరలు పెంచిందని, దీంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయని చెప్పారు. ఇప్పుడు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో దేశంలోనూ పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తే నిత్యావసర వస్తువుల ధర తగ్గి ప్రజలపై ఆర్థిక భారం తగ్గుతుందని ఆయన చెప్పారు. అయితే, ఇందుకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని విమర్శలు గుప్పించారు.