ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ను వేధిస్తున్న ఇసుక కొరతను తీర్చడానికి సీఎం జగన్ సిద్ధమయ్యారు. ఇటీవల సొంత పార్టీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్రంలో తలెత్తిన ఇసుక కొరతపై సూచనలు చేయడంతో సీఎం జగన్ ఇప్పుడు ఆ సమస్యపై దృష్టి సారించారు. మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో ఇసుకపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. లాక్ డౌన్ తర్వాత ఇసుక రీచ్ లన్నీ మూతపడడం.. మళ్లీ రీచ్ లు ప్రారంభం అవుతున్నాయని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. అనంతరం సీఎం జగన్ అధికారులకు కీలక సూచనలు చేశారు. వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్ కు అవకాశం కల్పించాలని ఆదేశించారు. శాండ్ పోర్టల్ లో ఇసుక అమ్మకాలు విరివిగా చేయాలన్నారు. ఇదే సమయంలో నదులు, వాగులు వంకల పక్కన ఉండే పరిసర గ్రామాల ప్రజలకు సొంత అవసరాల కోసం ఎడ్ల బండ్ల ద్వారా ఇసుకను ఉచితంగా తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక బుకింగ్ కు సమయం ఇవ్వాలన్నారు. శాండ్ పోర్టల్ లో బల్క్ ఆర్డర్లకు అనుమతుల అధికారం జాయింట్ కలెక్టర్ కు ఇవ్వాలని ఆదేశించారు.