నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. జూన్ ఒకటో తేదీనే రుతుపవనాలు కేరళలోకి రంగ ప్రవేశం చేయటంతో ఏపీ, తెలంగాణ రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం తప్పనిసరిగా నమోదవుతుందని, 2% ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ విభాగం ప్రకటించింది. నైరుతి రుతుపవనాల వల్ల ఈసారి మంచి వర్షాలు కురుస్తాయని కేంద్ర ప్రభుత్వం, వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దక్షిణ అరేబియా సముద్రం, లక్ష దీవులు, మాల్దీవులు, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్తో పాటు ఆగ్నేయ బంగాళాఖాతంలో రుతుపవనాలు విస్తరించాయి. కేరళను తాకిన 8 నుంచి 9 రోజుల్లో ఏపీ, తెలంగాణకు వస్తాయి. ఈ నెల 9- 10 తేదీల్లో రాష్ట్రంలోకి ఇవి ప్రవేశించే అవకాశం ఉంది.