ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలో గోషనిన్గావ్లో నిన్న ఉదయం బీజేడీ నేత అలేఖ్ చౌదరి మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. ఆయన్ను కాపాడేందుకు వెళ్లిన మరో ఇద్దరు కూడా మంటల్లో చిక్కుకుని ఊపిరి ఆడక మృతి చెందినట్లుగా పోలీసులు దృవీకరించారు. పోలీసుల కథనం ప్రకారం అలేష్ చౌదరి తన రూంలో పడుకున్న సమయంలో ఏసీలో షార్ట్ సర్య్యూట్ అయ్యింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగగా అలేష్ చౌదరి పెద్దగా అరవడంతో ఆయన బావమర్ధి మరియు ఒక బంధువు కాపాడేందుకు వెళ్తారు. వారు కూడా బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫైర్ మరియు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. అప్పటికే ముగ్గురు కూడా అపస్మారక స్థితిలో ఉన్నారు. వారిని బరంపురంలోని హాస్పిటల్కు తరలించగా అప్పటికే ముగ్గురు మృతి చెందినట్లుగా వైధ్యులు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు పని చేసిన ఈయన అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచాడు. మొన్నటి ఎన్నికల్లో కూడా ఓడిపోవడంతో అధికార బీజేడీ లో జాయిన్ అయ్యాడు. పార్టీ పదవితో పాటు నామినేటెడ్ పదవి కూడా వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఇలా మృతి చెందాడు అంటూ కుటుంబ సభ్యులు మరియు పార్టీ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.