కరోనా వైరస్ ఆరోగ్య సంక్షోభాన్ని మాత్రమే కాదు ఆర్థిక సంక్షోభాన్ని కూడా తీసుకొచ్చింది. కరోనా వైరస్ ప్రభావంతో అనేక రంగాలు దెబ్బతిన్నాయి. దేశ ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడింది. కరోనా వైరస్ కారణంగా దెబ్బతినని రంగం ఏదీ లేదు. అన్ని రంగాల్లో ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉంది. ఉద్యోగాల్లో కోతలు తప్పట్లేదు. అనేక కంపెనీల్లో వేతనాల్లో కోత విధిస్తున్నాయి. ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆదుకునేందుకు ప్రభుత్వ పథకం ఒకటి ఉంది. ఒకవేళ ఉద్యోగం కోల్పోతే 3 నెలలు ప్రభుత్వం నుంచి వేతనం పొందొచ్చు. ఈ పథకం పేరు 'అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్' స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగం కోల్పోయిన వారికి ప్రభుత్వం మూడు నెలల పాటు ఆర్థికంగా చేయూతను ఇస్తుంది. ప్రతీ నెల ఆర్థిక సాయం పొందొచ్చు.
'అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్' స్కీమ్ను 2018 జూలై 1న ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్-ESIC ద్వారా బీమా పొందిన సంఘటిత రంగ ఉద్యోగులు ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందొచ్చు. ఈఎస్ఐసీ చట్టం, 1948 లోని సెక్షన్ 2(9) ప్రకారం ఈ బెనిఫిట్స్ లభిస్తాయి. ఇలా ప్రభుత్వం నుంచి మూడు పాటు ఆర్థికంగా చేయూత లభిస్తుంది. జీవితంలో ఒకసారి మాత్రమే ఈ బెనిఫిట్ పొందొచ్చు. అది కూడా రెండేళ్లుగా ఉద్యోగం చేస్తూ ఉండాలి. ఈఎస్ఐలో కంట్రిబ్యూషన్ తప్పనిసరి. మీ బ్యాంకు అకౌంట్కు ఆధార్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి. ఈఎస్ఐ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నిరుద్యోగి ఉద్యోగంలో ఉన్నప్పుడు చివరి 90 రోజులు ఎంత వేతనం పొందారో అందులో 25 శాతం ప్రభుత్వం నుంచి సాయం పొందొచ్చు.
ఆర్థిక సంక్షోభం లేదా ఇతర కారణాల వల్ల ఉద్యోగాలు కోల్పోయినవారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. సంస్థలో తప్పుడు ప్రవర్తన ద్వారా ఉద్యోగం కోల్పోయినా, క్రిమినల్ కేసులు ఉన్నా, వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ ఎంచుకున్నా వారికి ఈ పథకం వర్తించదు. మరి మీరు కూడా ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందాలంటే www.esic.nic.in/ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి.