కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలను సాక్షాత్తూ మధ్యప్రదేశ్ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రే ఉల్లంఘించిన ఉదంతం సంచలనం రేపింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రిగా నరోత్తం మిశ్రా తాజాగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మంత్రి నరోత్తం మిశ్రా తన స్వగ్రామమైన డాటియా గ్రామానికి వచ్చారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి మొట్టమొదటిసారి తన స్వగ్రామానికి వచ్చిన మంత్రి మిశ్రాకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. కరోనా లాక్ డౌన్ అమలులో ఉన్నా డాటియా గ్రామంలో మంత్రి మిశ్రాతోపాటు గ్రామస్థులు కూడా కనీసం మాస్క్ లు ధరించలేదు.దీంతోపాటు సామాజిక దూరం కూడా పాటించకుండా మంత్రికి గుమిగూడిన గ్రామస్థులు, మహిళలు హారతి ఇచ్చి ఘనస్వాగతం పలికారు. మంత్రి నరోత్తం మిశ్రా నుదిటిపై కుటుంబసభ్యులు, అతని మద్ధతుదారులు తిలకం దిద్ది, మిఠాయిలు తినిపించారు. సాక్షాత్తూ వైద్యఆరోగ్యశాఖ మంత్రి అయిన మిశ్రాతోపాటు జనం గుమిగూడి లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా మాస్క్ ధరించకుండా ఉన్నారు. దీంతోపాటు సామాజిక దూరం పాటించలేదు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రధాని మాస్క్ ధరించడంతోపాటు సామాజిక దూరం పాటించాలని కోరుతున్నా సాక్షాత్తూ వైద్యశాఖ మంత్రే దీన్ని ఉల్లంఘించడం చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,090 కి చేరుకోవడంతోపాటు మరణాల సంఖ్య వందదాటినా వైద్యశాఖ మంత్రి ఇలా నిబంధనలను ఉల్లంఘించడంపై విమర్శలు వెల్తువెత్తుతున్నాయి.