ఏసుక్రీస్తుకు కల్వరిగిరిపై శిలువచేసిన రోజును ఏటా గుడ్ ఫ్రైడేగా నిర్వహిస్తారు. కల్వరి వద్ద ఆయన మరణం తాలుకా జ్ఞాపకాలను క్రైస్తవ సోదరులు గుర్తుచేసుకునే రోజు ఇది. ఈ పవిత్ర వారంలోని మూడు రోజులలో భాగంగా ఈస్టర్కు ముందు వచ్చే శుక్రవారాన్ని క్రైస్తవులు గుడ్ ఫ్రైడేను నిర్వహిస్తారు. దీనిని హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు గుడ్ ఫ్రైడే రోజు చర్చిలకు వెళ్ళి యేసు ప్రభువును ప్రార్థిస్తారు. క్రీస్తు జననం(క్రిస్మస్) పండుగ తర్వాత క్రీస్తు పేరిట ప్రార్థనలు, ప్రాయశ్చిత్తం, ఉపవాసాలను పాటిస్తారు. ఈ సమయాన్నే "ఈస్ట్ వెడ్నెస్డే" నుంచి ప్రారంభమౌతుంది. ఇది గుడ్ ఫ్రైడే రోజుకు పరిసమాప్తమవుతుంది. దీనినే లెంట్ అని అంటారు. ఇదే రోజున క్రీస్తును శిలువ చేశారు. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు కొయ్యతో చేసిన శిలువను చర్చిలలో ఉంచి ప్రార్థిస్తారు. ప్రతి ఒక క్రిస్టియన్ వచ్చి ఆ శిలువను ముద్దాడుతారు. ఆ తర్వాత మధ్యాహ్నంనుంచి మూడు గంటలవరకు సేవలుంటాయి. ఈ సేవలలో క్రీస్తు సిద్ధాంతాల(నాలుగు గోస్పెల్స్)లోంచి ఏదో ఒక దానిని చదివి భక్తులకు వినిపించి వారిచేతకూడా చదివిస్తారు. ఆ తర్వాత చర్చిలలో ప్రవచనాలు, ధ్యానం మరియు ప్రార్థనలు జరుగుతాయి. ఈ సందర్భంగా క్రీస్తును ఎలా శిలువ చేసేరనేదానిపై మత పెద్దలు ఉపన్యాసం చేసి క్రీస్తును స్మరించుకుంటారు. దీని తర్వాత అర్థరాత్రికి సాధారణ కమ్యూనియన్ సర్వీస్ ఉంటుంది. అంటే సామూహిక ప్రార్థనలలో క్రీస్తు స్మృతిపథాన్ని గుర్తు చేసుకుంటారు. కొన్ని చోట్ల నల్లటి వస్త్రాలు ధరించి భక్తులు క్రీస్తును స్మరిస్తూ ఒక సమారోహాన్ని ఏర్పాటు చేస్తారు. చివరికి కృత్రిమ అంతిమ సంస్కారం కూడా చేస్తారు. క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు గుడ్ ఫ్రైడే రోజున ప్రాయశ్చిత్తం, ప్రార్థనలు చేసుకునే రోజు. ముఖ్యంగా గుడ్ ఫ్రైడే రోజు చర్చిలలో గంటలు మోగవు.