ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తునట్టు ఆయన చెప్పారు. దీనికి సంబంధించి సోమవారం అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. కరోనా బాధితులను ప్రైవేటు ఆస్పత్రులు కూడా చేర్చుకొని చికిత్స అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనాకు సంబంధించి కొత్తగా 15 రకాల వైద్య చికిత్సలను సర్కార్ ఆరోగ్య శ్రీ ప్యాకేజీలో కలిపింది. అదే విధంగా కరోనా పరీక్షలు,వ్యాధి నిర్దారణ,ఇతర వైద్య చికిత్సలకు కలిపి సర్కార్ ధరల ప్యాకేజిని కూడా నిర్ణయించింది. కనీసం రూ.16 వేల నుంచి గరిష్టంగా రూ.2.16 లక్షల వరకు ప్రభుత్వం కరోనా ఫీజులను నిర్ణయించింది. ప్రతి ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. సాధారణ రోగులకు ఇబ్బంది లేకుండా ఆస్పత్రులలో ఏర్పాట్లు ఉండాలన్నారు. ఏపీలో ఇప్పటి వరకు 303 కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్క రోజే 37 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కర్నూలులో 74, నెల్లూరులో 42,గుంటూరులో 32 కేసులు నమోయ్యాయి. రోజురోజుకు కేసులు పెరుగుతుండడంతో ఏపీ సర్కార్ అలర్ట్ ప్రకటించింది. మరో వైపు సీఎం జగన్ కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం పై అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.