స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన పెద్ద మనసు చాటుకున్నాడు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్పై పోరాడెందుకు తన వంతు సాయం ప్రకటించాడు. ఫెదరర్ రూ.7.75 కోట్లను విరాళంగా ప్రకటించాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. ప్రపంచంలో కరోనా వల్ల అత్యంత ప్రభావితమైన దేశాల్లో స్విట్జర్లాండ్ తొమ్మిదో స్థానంలో ఉంది. ఇప్పటివరకు 8,800 మందికి కరోనా సోకగా.. 86 మంది మృతిచెందారు.
స్విట్జర్లాండ్లో రోజురోజుకు కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో అక్కడి వ్యాపార, క్రీడా, సినీ ప్రముఖులు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తున్నారు. తనను ఎంతో అభిమానించే ప్రజల రక్షణ కోసం ఫెదరర్ కూడా తన వంతు సాయం ప్రకటించాడు. విషయం తెలుసుకున్న ప్రజలు ఫెదరర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో, అతడి ఏజెంట్.. కరోనా బాధితుల కోసం తమ హోటల్లో రెండు ఐసీయూ వార్డులు తీర్చిదిద్ది ప్రభుత్వానికి ఇచ్చారు.
అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ కూడా తన పెద్ద మనసు చాటుకున్నాడు. కరోనాపై పోరాడెందుకు తన వంతు సాయంగా ఒక మిలియన్ యూరోలను విరాళంగా ప్రకటించాడు. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.8.2 కోట్లు. ఈ డొనేషన్లో సగం బార్సీలోనా ఆసుపత్రులకు మిగతాది తన సొంత దేశం అర్జెంటీనాలో ఖర్చు చేయనున్నారని మార్కలోని ఒక నివేదిక తెలిపింది. కరోనా వైరస్పై పోరాడేందుకు లియోనల్ మెస్సీ ఆసుపత్రులకు విరాళాన్ని ప్రకటించాడని సంబంధిత క్లినిక్స్ తెలిపాయి. 'నీకు ధన్యవాదాలు లియో' అంటూ ట్వీట్ చేశాయి.
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కోల్కతాలో ఇబ్బందులకు గురవుతున్న పేద ప్రజలకు సాయం చేయడానికి బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ముందుకొచ్చాడు. నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆశ్రయం పొందుతున్న పేదలకు రూ.50 లక్షల విలువైన బియ్యం పంపిణీ చేయనున్నట్లు వెల్లడించాడు. ఇప్పటికే బజరంగ్ పూనియా, గౌతమ్ గంభీర్ విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే.