అహ్మదాబాద్: భారత్ పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. సోమవారం అహ్మదాబాద్లోని మోతెరా స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో..నమస్తే.. ఐ లవ్ టు ఇండియా అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. భారత్కు రావడం చాలా సంతోషంగా ఉందని, గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. భారత్ ఆతిథ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. భారత్ ప్రజాస్వామ్య, శాంతియుత దేశమని ట్రంప్ అన్నారు. ఈ సందర్భంగా స్వామి వివేకానందను గుర్తు చేసుకున్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు భారత్ పెద్దపీట వేస్తోందని, విభిన్న భాషల సమ్మెళనం ఇండియా అని కొనియాడారు. భారతీయ సినిమాలను ప్రపంచం ఇష్టపడుతోందని, భారత్ ఏడాదికి 2 వేల సినిమాలు నిర్మిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. డీడీఎల్జే సినిమాను ఆయన ప్రస్తావించారు. భారత్లో సచిన్, విరాట్ కోహ్లీ లాంటి గొప్ప ప్లేయర్లు ఉన్నారన్నారు. 70 ఏళ్లలోనే భారత్ అద్భుత శక్తిగా ఎదిగిందని ట్రంప్ వ్యాఖ్యానించారు.