టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికుట్రలు చేసిన ధర్మమే గెలుస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.2లక్షల కోట్లు అప్పు చేసి చంద్రబాబు రాష్ట్రాన్ని దివాళా తీయించారని ఆరోపించారు. కియా యూనిట్ ఎక్కడికీ తరలిపోవడం లేదని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పినా పట్టించుకోకుండా టిడిపి గగ్గోలు పెడుతోందని విమర్శించారు.వేల కోట్లు పెట్టుబడులు పెట్టి ఎవరైనా వెళ్లిపోతారా అని ప్రశ్నించారు. ఫోక్స్ వ్యాగన్ వ్యవహారంలో అమాయకంగా నమ్మి మోసపోయానని, దానిపై సీబీఐ దర్యాప్తు కూడా వేసుకున్నామని వివరించారు.
రాష్ట్రంలో 53,70,210 మందికి పింఛన్లు ఇస్తున్నట్టు తెలిపారు. ఇవి కాకుండా 31,690 మందికి ఆరోగ్యపరమైన పింఛన్లు జారీ చేసినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా 6లక్షల మందికి పింఛన్లు ఇచ్చామని తెలిపారు. 4,16,034 మంది పింఛనుకు అనర్హులుగా గుర్తించామన్నారు. వీరిలోనూ పునఃపరిశీలన చేసి పింఛన్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. వార్డు వాలంటీర్లు ప్రస్తుతం తనిఖీలు చేస్తున్నారన్నారు. ఈనెలతో కలిపి వారికి రెండు నెలల పింఛను ఇస్తామని మంత్రి వెల్లడించారు.