ఏపీలో దారుణం చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే స్టూడెంట్స్ తో క్షుద్ర పూజలు చేయించిన ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలోని సి.వడ్డేపల్లి ప్రాథమిక పాఠశాలలో రవి కుమార్ అనే ఉపాధ్యాయుడు పని చేస్తున్నాడు. స్కూల్లో ఓ విద్యార్ధిని చెవి కమ్మలు పోయాయి. ఈ సంఘటన తెలుసుకున్న టీచర్ రవికుమార్ క్షుద్రపూజలకు తెరలేపాడు. మంత్రగాడిని పిలిపించి అంజనం వేయిస్తే చెవి కమ్మలు దొరుకుతాయని స్కూల్ విద్యార్ధులకు టీచర్ చెప్పాడు. అందరూ తలస్నానం చేసి రావాలని విద్యార్ధులకు చెప్పాడంతో.. ఆదివారం పూట విద్యార్థులంతా తల స్నానాలు చేసి స్కూల్ కు వెళ్లారు.
అప్పటికే మంత్రగాడు రమణతో ఉపాధ్యాయుడు రవి సిద్దంగా ఉన్నాడు. స్టూడెంట్స్ చేతి గోళ్లపై పసరు రాసి మంత్రం పఠిస్తున్న సమయంలో ఓ విద్యార్ధి తాత స్కూల్ కు రావడంతో క్షుద్రపూజల బాగోతం బయటపడింది. పిల్లలతో ఏం చేయిస్తున్నారని టీచర్ రవికుమార్ తో పాటు మంత్రగాడు రమణను ఆ పెద్దాయన ప్రశ్నించడంతో అక్కడి నుంచి వాళ్లిద్దరూ పరారయ్యారు. ఆగ్రహించిన గ్రామస్థులు ఉపాధ్యాయుడి నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రోజు స్కూల్ కు వచ్చిన టీచర్ రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమకు ఏదో ఆకు పసరు పూశారని తర్వాత తల తిరిగినట్లు అయిందని విద్యార్థులు తెలిపారు. పాఠశాలలో క్షుద్రపూజల ఘటనపై ఎంఈవో చక్రేనాయక్ సీరియస్ అయ్యారు. విచారణ జరిపి ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే ఆ ఉపాధ్యాయుడు ఎందుకోసం క్షుద్రపూజలు చేసారన్నది తెలియాల్సి ఉంది.