చిత్తూరులో వైసీపీకి ఘోర అవమానం జరిగింది.. చిత్తూరు జిల్లా నారావారిపల్లె సమీపంలోని రంగం పేటలో పాలనా వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సభ నిర్వహించారు. వైసీపీ సభకు ప్రజల నుంచి స్పందన కరువైంది. ఈ సభకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి , వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కల్లం అంజిరెడ్డి ప్రసంగిస్తుండగానే సభ నుండి ప్రజలు వెళ్లిపోవడం ప్రారంభించారు. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉండగా సభ దాదాపుగా ఖాళీ అయింది.
సభలోని 90% శాతం కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. దీనితో సభ ఏర్పాటు చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతలను క్లుప్తంగా మాట్లాడాలంటూ విన్నవించారు. అమరావతి పై ఉన్న ప్రేమ నారవారిపల్లె పై చంద్రబాబుకు ఎందుకు లేదన్నారు మంత్రి కన్నబాబు. చాలా ప్రాంతాలు అభివృద్ధి కాలేదని.. అందుకే సీఎం జగన్ వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మూడు రాజధానుల ఏర్పాటు ఆలస్యం కావచ్చేమో కానీ నిర్ణయం పై సీఎం వెనక్కి తగ్గరని అన్నారు కన్నబాబు.
అమరావతియే రాజధానిగా ఉండాలని 29 గ్రామాల ప్రజలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు నారా వారి పల్లె వాసులు. బయటి ప్రాంతాల నుంచి జనాన్ని తీసుకువచ్చి సభను నిర్వహించారని స్థానికులు వెల్లడిస్తున్నారు.అమరావతి రాజధానిగా భూములు ఇచ్చిన రైతులకు సంఘీభావం కోసం అందరం కట్టుబడి ఉన్నామని గ్రామస్తులు తెలియజేశారు. అమరావతిలో ఆందోళన చేస్తున్న వారిని పెయిడ్ ఆర్టిస్టులతో పోల్చడం పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గ్రామస్తులు. వైసీపీ సభ ముగిసిన తర్వాత నారావారిపల్లె లోని రహదారులను శాప్ మాజీ చైర్మన్ పీఆర్ మోహన్ పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. జై చంద్రబాబు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి కొబ్బరికాయ కొట్టి నివాళులు అర్పించారు. మొత్తం మీద మూడు రాజధానులకు మద్దతుగా నారావారిపల్లె లో వైసీపీ నిర్వహించిన సభ ఫ్లాప్ అయ్యిందని అంటున్నారు.