ఉన్నావ్ అత్యాచారం, హత్య కేసులో నిర్తక్ష్యంగా వ్యవహరించిన ఉన్నావ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అజయ్ త్రిపాఠితోపాటు ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ ఎస్పీ విక్రాంత్ వీర్ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తున్న బాధితురాలిపై దాడి చేసిన నిందితులు కిరోసిన్ పోసి నిప్పు పెట్టగా. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో ఆమె శుక్రవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. తాజాగా బాధితురాలిపై అత్యాచారం,పెట్రోల్ పోసి నిప్పంటిన నిందితుల్లో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న శివం త్రివేది బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. అంతేగాక ఇందుకు ఓ ఒప్పంద పత్రం కూడా రాసిచ్చాడు. ఇదంతా మహిళను అత్యాచారం చేయకముందే జరగడం గమనార్హం.
అయితే గత ఏడాది డిసెంబర్లో మహిళను అత్యాచారం చేసిన ఇద్దరు నిందితుల్లో ఒకరైన శివం త్రివేదిని పోలీసులు అరెస్టు చేయగా ఇటీవలే బెయిల్పై బయటికి వచ్చిన నిందితుడు.. బాధితురాలిని కేసు ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశాడు. ఇందుకు యువతి ఒప్పుకోకపోవడంతో గురువారం ఉదయం బాధితురాలిపై దాడికి దిగి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడని పోలీసులు చెప్పారు. ఈ ఘటన అనంతరం పోలీసులు అయిదుగురు నిందితులను అరెస్టు చేశారు.
కాగా ఈ కేసులో నిందితులకు త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల నష్టపరిహారం ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే మృతురాలి కుటుంబం డిమాండ్ మేరకు బాధితురాలి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్టు లక్నో డివిజనల్ కమిషనర్ ముఖేష్ మెష్రం ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు.
ఇప్పటికే బాధితురాలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.