ఆంధ్ర ప్రదేశ్ లోని పలు యూనివర్సిటీ క్యాంపస్ లలో వాల్ పోస్టర్ ల కలకలం మొదలైంది. నిరంకుశంగా వ్యవహరిస్తున్న ఏపీపీఎస్సీ ఛైర్మన్ ను తొలగించి, బీసీ,ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ పోస్టర్లు వెలిశాయి. కొన్ని రోజులుగా ఏపీపీఎస్సీ కార్యాలయం లో చైర్మన్ ఉదయ భాస్కర్ విధులకు హాజరు కావడం లేదు. కార్యాలయంలో తన చాంబర్ లోకి ఎవరూ వెళ్లకుండా తాళాలు వేసుకుని వెళ్లాడు. ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయాలని, ఛైర్మన్ ను మార్చాలని ఇప్పటికే గవర్నర్కు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఛైర్మన్ ఢిల్లీ లో వున్న తన కులానికి చెందిన ఎంపీల తో మంతనాలు చేస్తున్నారు. దేశం లోనే అతిపెద్ద ముఖ్య నేత జోక్యం చేసుకుని తన పదవిని కాపాడాలంటూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఆరెస్సెస్ పెద్దలను కలవడానికి ఢిల్లీ లో లాబీయింగ్ చేస్తున్నాడు. గత నాలుగున్నరేళ్లుగా చైర్మన్ బెదిరింపుల ధోరణి తో వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ లో బినామీ గా నడుపుతున్న లక్ష్య కోచింగ్ సెంటర్ కు ఏపీపీఎస్సీ సిలబస్ పత్రాలు వెళ్తున్నాయని అభ్యర్థులు విమర్శిస్తున్నారు. బోర్డు డైరెక్టర్ లను, పానలిస్ట్ లను సంప్రదించకుండా సిలబస్, ఏపీపీఎస్సీ పరీక్షా విధానాల్లో మార్పులు చేశాడు. దీంతో ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అసెంబ్లీ, మండలి సమావేశాల నేపధ్యంలో ఛైర్మన్ ధోరణి చర్చగా మారింది.