మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ "పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని తెలుసు. బ్యాటింగ్ ఆర్డర్లో దూబే ముందుకు వెళ్లి స్పిన్నర్లపై దాడికి దిగాలని భావించాం. అందుకే అతడిని మూడో స్థానంలో బరిలోకి దింపాం. మా ప్రణాళిక ఫలించింది. అతడు బాగా ఆడటం వల్లే ఈ మ్యాచ్లో మంచి స్కోరు సాధించగలిగాం" అని అన్నాడు. "గత రెండు మ్యాచుల్లో మా ఫీల్డింగ్ నాసిరకంగా ఉంది. భువనేశ్వర్ వేసిన ఓవర్లో రెండు క్యాచ్లు జారవిడిచాం. మా ఫీల్డింగ్ కచ్చితంగా మెరుగుపడాలి. తొలి టీ20లో ఒక క్యాచ్ను అందుకోవడానికి ఒంటి చేత్తో ప్రయత్నించాను. కానీ, అది సాధ్యపడలేదు. ఈ సారి రెండు చేతులతో ఒడిసిపట్టుకున్నా" అని కోహ్లీ తెలిపాడు. "చివరి నాలుగు ఓవర్లలో మా బ్యాటింగ్ బాగాలేదు. 16 ఓవర్లు పూర్తయ్యేసరికి 144/4తో ఉన్నాం. ఈ దశలో మరో 50 పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేది. కానీ అలా జరగలేదు. ఈ అంశంపై దృష్టి సారిస్తాం. శివమ్ దూబే చక్కగా ఆడాడు. ఇక చివరిదైన మూడో మ్యాచ్ చావోరేవో లాంటిది కాబట్టి వంద శాతం పోరాడుతాం" అని కోహ్లీ వెల్లడించాడు. రెండో టీ20లో వన్డౌన్లో కోహ్లీకి బదులు వచ్చిన శివమ్ దూబే (54; 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. టీ20ల్లో శివమ్ దూబేకి ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్లో తొలుత నిదానంగా ఆడిన దూబే తర్వాత సిక్సర్లు, బౌండరీలతో విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.