కొందరు పోలీసులుంటారు. సామాన్య ప్రజలను ఏ మాత్రం పట్టించుకోరు. ప్రాణాలు పోతున్నా కనీసం స్పందించరు. కానీ మరికొందరు పోలీసుంటారు. ఖాకీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ..పౌరులకు భద్రత భరోసానిస్తూ.. నలుగురికీ ఆదర్శంగా ఉంటారు. ప్రజల కోసం ప్రాణాలకు తెగిస్తుంటారు. అలాంటి కోవలోకే వస్తారు ఈ పోలీస్. ఆపదలో ఉన్న మహిళను ప్రాణాలకు తెగించి కాపాడాడు. నదిలో కొట్టుకుపోతున్న ఆమె కోసం.. ఏ మాత్రం ఆలోచించకుడా నదిలో దూకి సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. విజయవాడలో ఈ ఘటన జరిగింది.
ఓ మహిళ ప్రమాదవశాత్తు బందరు కాల్వలో పడిపోయింది. ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో కాల్వలో కొట్టుకుపోయింది. కాపాడాలని ఆమె కేకలు వేయడంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ ఎస్సై అర్జునరావు వెంటనే కాల్వలోకి దూకేశాడు. ఈదుకుంటూ వెళ్లి ఆ మహిళను ఒడ్డుకు చేర్చాడు. అనంతరం ప్రథమ చికిత్స చేసి ప్రాణాలతు కాపాడాడు. అర్జున రావు ధైర్య సాహసాలకు చూసి స్థానికులు ప్రశంసలు కురిపించారు. అర్జునరావు పేరును ప్రధానమంత్రి లైఫ్ సేవింగ్ మెడల్ కు నామినేట్ చేస్తున్నామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.