నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా సెల్వమణి సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. తన నియోజకవర్గం నగరిని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ఓ కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. నగరి నియోజకవర్గంలోని అన్ని వార్డులు, పంచాయతీలు పరిశుభ్రంగా ఉంచాలని అందరినీ కోరారు. ఈ క్రమంలో ఎవరైనా ప్లాస్టిక్ను తీసుకొస్తారో.. వారికి బియ్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఓ కేజీ ప్లాస్టిక్కు ఓ కేజీ బియ్యం ఇవ్వనున్నట్టు నగరి ఎమ్మెల్యే రోజా ప్రకటించారు. నగరి నియోజకవర్గంలో పలుచోట్ల రోజా పర్యటించారు. ఈ సందర్భంగా ఓ కాలువ వద్ద ప్లాస్టిక్ వ్యర్థాలను చూసిన ఆమె వెంటనే ఈ ప్రకటన చేశారు. ‘ప్లాస్టిక్ రహిత వార్డులు, పంచాయతీలుగా నగరిని నిర్మిద్దాం. నో ప్లాస్టిక్, న్యూ నగరి అని పిలిచేలా చేద్దాం. ఎవరు ప్లాస్టిక్ను తీసుకొస్తారో వారికి రైస్ ఇస్తాం. కిలో ప్లాస్టిక్కు కిలో బియ్యం. నా పుట్టిన రోజు నవంబర్ 17 నుంచి సీఎం జగన్ పుట్టిన రోజు డిసెంబర్ 21 వరకు 40 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం.’ అని రోజా ప్రకటించారు.