తూర్పు గోదావరి జిల్లా మెట్ట ప్రాంతమైన తుని నియోజకవర్గంలో రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి కష్టాలు తీర్చేందుకు తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు సంతృప్తికరంగా అందించే విధంగా పథక రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా తాండవ రిజర్వాయర్ లోకి ఎత్తిపోతల పథకం ద్వారా ఏలేరు రిజర్వాయర్ నీటిని మళ్లించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. శుక్రవారం ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఓమ్ము చేసేదిలేదని పేర్కొన్నారు. నిత్యం సాగునీటి ఎద్దడి తో సతమతమవుతున్న రైతాంగాన్ని ఆదుకుంటాం అన్నారు. ఈ ప్రాంతంలో వంట భూముల్లో మూడు పంటలు పండే విధంగా సాగునీటిని సరఫరా చేస్తామన్నారు. రానున్న రెండేళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించి రూపురేఖలనే మార్పు చేస్తామన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకోవడం తోపాటు, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం. వెంకటేష్ , ఏలూరి బాలు, రేలంగి రమణ గౌడ్, పోతల రమణ, పోతుల లక్ష్మణ్, ఎస్.కె. క్వాజా, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.