జగన్ రెడ్డి అని పిలవకుండా.. మరి ఏమని పిలవాలో చెప్పాలని వైసీపీ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. గుంటూరులోని మంగళగిరిలో ఆయన జనసైనికులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ రెడ్డి అని పిలిస్తే దురుద్దేశాలు ఆపాదిస్తున్నారాని.. నన్ను మాత్రం పవన్ నాయుడు అంటున్నారు అని విమర్శించారు. జగన్ ని ఏమని పిలవాలో 151 మంది ఎమ్మెల్యేలు ఒక తీర్మానం తీసుకువస్తే ఆ విధంగా పిలుస్తామని పవన్ తెలిపారు. కులమతాలకు అతీతంగా రాజకీయాలు చేయడమే మా సిద్ధాంతమని ఆయన అన్నారు. ఇతరుల వివాహం విషయం, విడిపోయిన వారి జీవితాలపై మాట్లాడటానికి మీకు ఇంగితం లేదా ? అంటూ వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తే మట్టిలో కలిసిపోతారనే మాటను తాను ఆవేశంలో అనలేదని, ఉద్దేశపూర్వకంగానే అన్నానని పవన్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ తెగ బాధపడిపోతున్నారని వ్యంగ్యంగా పేర్కొన్నారు.