టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన ఆ పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ... అనేక అంశాలపై చంద్రబాబు తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అంశాన్ని ప్రస్తావించారు వల్లభనేని వంశీ. 2009లో తన ప్రాణాలను ఫణంగా పెట్టి టీడీపీ తరపున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్... ఆ తరువాత టీడీపీకి ఎందుకు దూరమయ్యారని వల్లభనేని వంశీ చంద్రబాబును ప్రశ్నించారు. పదేళ్ల పాటు టీడీపీకి ఎన్టీఆర్ ఎందుకు దూరంగా ఉన్నారో అంతా ఆలోచించాలని వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారు. టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా నల్లపూసగా మారిపోయారని వల్లభనేని వంశీ అనడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న వల్లభనేని వంశీ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.