కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఏపీలోని అధికార పార్టీ తీరును తప్పుబట్టారు. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో పని చేస్తోందని, ఇది మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. ఏపీలో బీజేపీ కార్యకర్తలపై వైసీపీ దాడులకు పాల్పడుతోందనే ఫిర్యాదులు తమకు అందుతున్నాయని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలనే వైసీపీ కూడా చేస్తోందని అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి... ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా మంచి పాలన అందించాలని కోరారు. కక్ష సాధింపులు మంచి సంప్రదాయం కాదని సూచించారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఉద్దేశించి ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి తప్పుబట్టారు. ఎక్కడైనా సరే మాతృభాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన వ్యవహారంపై ఆయన స్పందించారు. పొత్తు ధర్మానికి శివసేన తూట్లు పొడిచిందని... పొత్తు లేకపోతే బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదని ఆయన తెలిపారు. విశాఖలో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి... జీవీఎంసీ అధికారుల పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు.