టీ20 సిరిస్ ముగిసింది. మూడు టీ20ల సిరిస్ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. ఇక, అందరి దృష్టి పింక్ బాల్ టెస్టుపై పడింది. నవంబర్ 22 నుంచి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి డే/నైట్ టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ పింక్ బాల్ టెస్టు కోసం ఇప్పటికే క్యాబ్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పింక్ బాల్తో ఆడిన అనుభవం కోల్కతా డే/నైట్ టెస్టులో తనకు సహకరిస్తుందని టీమిండియా బ్యాట్స్మన్ పుజారా చెప్పుకొచ్చాడు. 2016 దులీఫ్ ట్రోఫీలో పుజారా ఆడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్లో జరగనున్న తొలి డే/నైట్ టెస్టుపై పుజారా మాట్లాడుతూ "పింక్ బాల్తో ఆడేటప్పుడు తీవ్రమైన ఇబ్బందులు తలెత్తవని భావిస్తున్నా" అని అన్నాడు. "ఎర్రబంతితో ఆడిన తీరులోనే పింక్ బాల్ ఉంటుందని నా అభిప్రాయం. ఎస్జీ పింక్ బాల్తో ఇప్పటివరకు నేను ఆడలేదు. కానీ, ఎస్జీ పింక్ బంతి సాధారణ బంతిలా ఉంటుదని నాకు అనిపిస్తుంది. బంతుల తయారీలో ఎస్జీ మెరుగుపడింది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో ఉపయోగించిన బంతిపై ఆటగాళ్లంతా సంతృప్తి చెందారు" అని పుజారా తెలిపాడు. 2016 దులీప్ ట్రోఫీ ఎడిషన్లో కూకబుర్రా పింక్ బాల్తో ఆడిన పుజారా(453) పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇందులో రెండు సెంచరీల కూడా ఉన్నాయి. కాగా, కోల్కతా వేదికగా జరిగే డే/నైట్ టెస్టు కోసం బీసీసీఐ ఇప్పటికే 72 ఎస్జీ పింక్ బాల్స్ను ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై పుజారా తన అనుభవాన్ని పంచుకున్నాడు. "2016/17లో పింక్ బంతితో ఆడాను. దీనిని ప్రయోజనంగా పరిగణించలేము. అయితే, ఆ అనుభవం కచ్చితంగా నాకు సహకరిస్తుంది. మీరు పింక్ బాల్తో ఆడినప్పుడు, ఏ సమయంలో ఏమి ఆశించాలో... ఏమి ఆశించికూడదో తెలుసు. కాబట్టి ఆ అనుభవం సహాయపడుతుంది" అని పుజారా చెప్పుకొచ్చాడు. "సాయంత్ర సమయంలో పింక్ బాల్తో ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే, ప్రాక్టీస్ చేస్తే వాటిని అధిగమించవచ్చు. కాబట్టి మ్యాచ్ ఆడటానికి ముందు ప్రాక్టీస్ సెషన్లు అవసరం. అవకాశం వచ్చినప్పుడల్లా పింక్ బాల్తో ప్రాక్టీస్ చేస్తాను" అని అన్నాడు. ఇక, భారత్లో డే/నైట్ టెస్టు మ్యాచ్ నిర్వహించడం మంచి చర్యగా అభివర్ణించాడు.