న్యూఢిల్లి : మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిన బిజెపికి త్వరలో ఎన్నికలు జరుగనున్న జార్ఖండ్లోనూ ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. బిజెపి మిత్రపక్షాలైన ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్(ఎజెఎస్యు), లోక్ జనశక్తి పార్టీ (ఎల్జెపి) లనుంచి సీట్ల పంపకాల ఫార్ములాపై ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. చక్రధర్ఫూర్ అసెంబ్లి నియోజక వర్గానికి ఎజెఎస్యు తమ అభ్యర్థిని పోటీకి నిలబెట్టింది. ఇదే స్థానంనుంచి బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ గిలుయాను ఆ పార్టీ పోటీకి నిలబెట్టింది. దీనితో ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. దీనితో వారు దీనిపై చర్చలు జరుపనున్నారు. ఎజెఎస్యు మొత్తం 19 స్థానాలు అడుగగా, బిజెపి మాత్రం 9 స్థానాలే ఇస్తామని ప్రకటించింది. ఎజెఎస్యు ఇప్పటికే 12 సీట్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. కాగా సిమారియా, సింద్రి, మండు, చక్రధర్పూర్ స్థానాల్లో ఇరు పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు.
బిజెపికి ఎజెఎస్యుతో కష్టాలు ఆరంభం కాగా, మరొక మిత్రపక్షమైన ఎల్జెపి ఈసారి ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు పేర్కొంది. 2014 ఎన్నికల్లో ఎల్జెపికి ఒక స్థానం కేటాయించగా, అక్కడ విజయం సాధించలేకపోయింది. ఎల్జెపిని ప్రస్తుతం రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వం వహిస్తున్నారు. బిజెపి 52 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. రెండవ జాబితాను ప్రస్తుతానికి సస్పెన్షన్లో ఉంచిందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎజెఎస్యుతో బిజెపి ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన ఫార్ములాపై చర్చలు జరుపుతోందని ఆ వర్గాలు తెలిపాయి. తమకు ఆరు సీట్లు ఇవ్వాలని కోరిన ఎల్జెపి తరువాత 37 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. గత ఎన్నికల్లో బిజెపి 72 స్థానాల్లో పోటీ చేయగా 37 సీట్లలో విజయం సాధించింది. ఎజెఎస్యు 8 స్థానాల్లో పోటీ చేయగా 5 స్థానాల్లో విజయం సాధించింది. ఎల్జెపి ఒక స్థానంలో పోటీ చేసి పరాజయం పాలైంది.