రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఏపీ అసెంబ్లీలో భారీ మెజార్టీతో విజయం సాధించిన వైసీపీకి కొన్నాళ్ల పాటు రాజకీయంగా తిరుగుండదని అంతా అనుకున్నారు. కానీ ఆరు నెలలు తిరగక ముందే ఏపీలో రాజకీయాలు మళ్లీ హాట్ హాట్గా మారిపోయాయి. ఓ వైపు ఏపీ సీఎం వైఎస్ జగన్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నా... ఇసుక కొరత సమస్య కారణంగా విపక్షాలకు వైసీపీ టార్గెట్ అవుతోంది. టీడీపీతో పాటు గత ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన సైతం వైసీపీని ఇసుక కొరత అంశంపై విమర్శలు గుప్పిస్తోంది.
ఇసుక కొరతపై జనసేన తలపెట్టిన విశాఖ లాంగ్ మార్చ్ సక్సెస్ కావడంతో... పవన్ కళ్యాణ్ నేరుగా ఏపీ సీఎం జగన్ను టార్గెట్ చేశారు. పులివెందులలో రాజధాని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని సీఎం జగన్పై ఊహించని విధంగా సెటైర్లు వేశారు. దీంతో అప్పటివరకు పవన్ కళ్యాణ్ను అంతగా పట్టించుకోని సీఎం జగన్... ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం అంశంపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. సీఎం జగన్ పవన్ కళ్యాణ్ను ఈ రకంగా టార్గెట్ చేయడం రాజకీయవర్గాల్లో ఆసక్తిరేపుతోంది.
అధికారంలోకి వచ్చిన తరువాత పవన్ కళ్యాణ్పై ఎప్పుడూ నేరుగా విమర్శలు చేయని సీఎం జగన్... హఠాత్తుగా జనసేన అధినేతపై విమర్శలు చేయడంలో ఆంతర్యం ఏమిటో చాలామందికి అర్థంకావడం లేదు. అయితే చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ను కూడా సీఎం జగన్ తన రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తున్నారని... చంద్రబాబు తరహాలోనే పవన్ కళ్యాణ్ను కూడా సీరియస్గా తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.