మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా శివసేన అడుగులు వేస్తోంది. శాసనసభ ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేసిన శివసేన 50-50 ఫార్ములా అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. దీనికి బిజెపి ససేమిరా అనడంతో ఆ పార్టీకి మద్దతు ఇవ్వడానికి శివసేన నిరాకరించింది. దీనితో బిజెపికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేకుండాపోయింది. మహారాష్ట్ర శాసనసభలో మొత్తం సీట్లు 288 కాగా, అధికారాన్ని చేపట్టడానికి కావలసిన
మేజిక్ ఫిగర్ 145. బిజెపి 105 స్థానాలో విజయం సాధించింది. శివసేన 56 స్థానాల్లో విజయం సాధించింది. ఎన్సిపి 54 సీట్లలో, కాంగ్రెస్ 44 సీట్లలో విజయం సాధించాయి. ఇతరులు 29 సీట్లు గెలుచుకున్నారు. బిజెపి, శివసేన పార్టీలు రెండూ కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు నల్లేరుపై నడకే. కానీ ఎన్నికలకు ముందు కుదిరిన ఒప్పందాన్ని బిజెపి అమలు చేయడం లేదని శివసేన ఆరోపిస్తూ బిజెపికి మద్దతు ఇవ్వడానికి నిరాకరించింది. తమకు తగిన సంఖ్యాబలం లేనందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోవడం లేదని బిజెపి గవర్నర్కు తేల్చి చెప్పింది. రెండవ అతిపెద్ద పార్టీ అయిన శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. ఎన్సిపి-కాంగ్రెస్ కూటమి మద్దతుతో శివసేన అధికారాన్ని చేపట్టడానికి సమాయత్తం అవుతోంది.