ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.2,000 నోట్లను రద్దు చేయాలి!

national |  Suryaa Desk  | Published : Fri, Nov 08, 2019, 07:38 PM

ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ (ఎస్‌.సి. గార్గ్) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.2,000 నోట్లను రద్దు చేయాలని అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, అంతరాయం ఏర్పడకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రజలు రూ.2 వేల నోట్లను దాచుకుంటున్నారని, అందుకే వ్యవస్థలో రూ.2,000 నోట్ల చెలామణి తగ్గిందని అభిప్రాయపడ్డారు. ‘రూ.2,000 నోట్ల సర్క్యులేషన్ తగ్గింది. వీటిని బయటకు రాకుండా నిల్వ చేస్తున్నారు’ అని గార్గ్ తెలిపారు. రూ.2,000 నోట్లను నిల్వ ఉంచుతున్నారనే దానికి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ వేగంగా విస్తరిస్తోందని, అయితే భారత్‌లో మాత్రం ఇది చాలా నెమ్మదిగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వ్యవస్థలో చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల విలువలో రూ.2 వేల నోట్లు మూడో వంతు వాటాను ఆక్రమించాయని పేర్కొన్నారు. కానీ చెలామణిలో మాత్రం ఈ నోట్లు తక్కువగా కనిపిస్తున్నాయని తెలిపారు. నరేంద్ర మోదీ 2016 నవంబర్ 8న రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. నేటితో నోట్ల రద్దుకు మూడేళ్లు. ఈరోజునే గార్గ్ రూ.2 వేల నోట్ల రద్దు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యవస్థలో నగదు వినియోగం ఇంకా ఎక్కువగానే ఉందని గార్గ్ తెలిపారు. రూ.2,000 నోట్లను ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా బ్యాన్ చేయాలని సూచించారు. నోట్ల బ్యాన్‌కు ఆయన ఒక మార్గాన్ని కూడా సూచించారు. రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే సరిపోతుందని తెలిపారు. అంటే కస్టమర్ బ్యాంకుల్లోకి వచ్చి తన అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తాడు. ఈ డిపాజిట్ చేసిన రూ.2 వేల నోట్లు ఇక తిరిగి వ్యవస్థలోకి వెళ్లవు. దీంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. అదే బ్యాంకుల్లో నోట్ల మార్పు నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులు ఉంటాయని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com