ఓ వైపు కుటుంబ మంతా పెళ్లి హడావిడిలో ఉంటే అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేయడం చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి తాలూకా బి.కొత్తకోట మండలం గట్టు గ్రామం గుట్ట పాలెం కు చెందిన రైతు సిద్ధారెడ్డి కుటుంబ సభ్యులంతా కలిసి కురబలకోట మండలంలో అంగళ్లు సమీపంలోని చేనేత నగర్ లో కళ్యాణ మండపంలో జరుగుతున్న ఓ పెళ్లి వేడుకకోసం వచ్చారు. కుటుంబమంతా నిద్రిస్తున్న క్రమంలో సిద్దా రెడ్డి కుటుంబానికి చెందిన వర్షిని అనే ఆరేళ్ల చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి, కళ్యాణ మండపానికి దగ్గరలోనే హత్య చేసి పరారయ్యారు. తెల్లవారు ఝామున చిన్నారి కనిపించక పోవటంతో కుటుంబ సభ్యులు వెతుకగా ఆ చిన్నారి శవమై కనిపించింది. దీంతో ఈ విషయం పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారి మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చిన్నారిని వేకువ ఝామునే హత్య చేసినట్టు వైద్యులు తమ నివేదికలో పేర్కొనటంతో ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు హంతకుల కోసం గాలింపు ముమ్మరం చేసారు.