ఐపీఎల్... బీపీఎల్... ప్రో కబడ్డీ ఇప్పుడు కొత్తగా అదే బాటలో మరో లీగ్ హైదరాబాదీలను అలరించడానికి వచ్చేసింది. హైదరాబాద్ నగరంలో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) మ్యాచ్లకు తెరలేవబోతోంది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా శనివారం నుంచి ఐఎస్ఎల్ హైదరాబాద్ ఎఫ్సి మ్యాచ్లు మొదలు కానున్నాయి. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో తొలిసారి బరిలో దిగిన హైదరాబాద్ ఎఫ్సీ సొంతగడ్డపై తొలి మ్యాచ్ ఆడేందుకు రంగం సిద్ధమైంది. టోర్నీలో భాగంగా శనివారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో కేరళ బ్లాస్టర్స్తో తలపడనుంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన హైదరాబాద్ ఎఫ్సి సొంతగడ్డపై బోణీ చేయాలని గట్టి పట్టుదలతో ఉంది. ఫుట్బాల్ చరిత్రలో హైదరాబాద్కు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. కానీ అది గతం. ఈ సీజన్లో తన తొలి మ్యాచ్లో 0-5తో అట్లెటికో ది కోల్కతా చేతిలో, రెండో మ్యాచ్లో 1-3తో జంషెడ్పూర్ ఎఫ్సీ చేతిలో పరాజయం పాలైంది. ఇలాంటి సమయంలో సొంత మైదానంలో వచ్చే తొలి విజయం మాంచి కిక్ ఇస్తుందనడంలో సందేహం లేదు.అయితే, కేరళ బ్లాస్టర్స్పై గెలుపు అంత సులభంగా దక్కకపోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ డిఫెన్స్ బలహీనంగా ఉంది. గాయాల కారణంగా రోజెరియో సిల్వా (బోబో), గిల్స్ బార్న్స్, రఫెల్ గోమెజ్ లాంటి కీలక ఆటగాళ్లు మ్యాచ్కు దూరమయ్యే అవకాశం ఉంది. దాంతో శనివారం నాటి మ్యాచ్లో భారం మొత్తం మార్సెలినోపైనే పడనుంది. 2016 సీజన్ గోల్డెన్ బూట్ అవార్డు గెలుచుకున్న మార్సెలినో గత మ్యాచ్లో గోల్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు సీజన్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్ల్లో ఓ గెలుపు, ఓటమి నమోదు చేసిన కేరళ బ్లాస్టర్స్ ప్రత్యర్థికి గట్టిపోటీ ఇవ్వనుంది. గత మ్యాచ్లో ముంబై ఎఫ్సీ చేతిలో ఓడిన ఆ జట్టు హైదరాబాద్పై గెలుపే లక్ష్యంగా బరిలో దిగనుంది. రూ.300 విలువ గల టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. దీంతో ఈ మ్యాచ్కు పెద్ద సంఖ్యలోనే అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైదరాబాద్ కోచ్ ఫిల్ బ్రౌన్ మాట్లాడుతూ "గాడిలో పడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాం. లీగ్ మొదలైనప్పటి నుంచి మేము తీరిక లేకుండా ప్రయాణం చేస్తూనే ఉన్నాం. చివరికి హైదరాబాద్ చేరుకున్నాం. రానున్న రెండు మ్యాచ్ల్లో గెలువాలన్నదే చూస్తున్నాం. బొబో, గైల్స్ బార్నెస్, సాహిల్ పన్వర్, రాఫెల్ గోమెజ్ ఫిట్నెస్పై జట్టు కూర్పు ఆధారపడి ఉంది. మర్సెలో పుంజుకుంటే తిరుగుండకపోవచ్చు" అని అన్నాడు.