విజయవాడ: విజయవాడలో ఈ నెల 10న జరిగే బూత్స్థాయి కార్యకర్తల రాష్ట్ర సమావేశానికి బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక విజయవాడకు నడ్డా తొలిసారి వస్తున్నారన్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల బూత్ కమిటీ అధ్యక్షులు, క్రియాశీల సభ్యులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారన్నారు. మొగల్రాజపురంలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు కన్నా తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి వచ్చే నాలుగున్నర సంవత్సరాల రోడ్ మ్యాప్ను నడ్డా రూపొందిస్తారని, నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారని వివరించారు. రాష్ట్రంలో ప్రభుత్వం సృష్టించిన ఇసుక కొరత వల్ల చాలా మంది నిరాశకులోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. సమస్యలు తీర్చకుండా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు చేయటాన్ని ప్రజలు హర్షించరని చెప్పారు.