గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేయడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. దీనిపై విజయవాడ టీడీపీ నేత బొండా ఉమ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజుల క్రితం వంశీ పార్టీ అధినేత చంద్రబాబును కలిశారని, ఆపై సుజనా చౌదరి కారులో గుంటూరు వెళ్లారని వివరించారు. అదే రోజు సాయంత్రం సీఎం జగన్ ను కలిశారని వెల్లడించారు. సీఎం జగన్ ను కలిసిన తర్వాత వంశీ మీడియా ముందుకు రాలేదని, అసలు జగన్ ను ఎందుకు కలిశారో వంశీ ఇప్పటివరకు చెప్పలేదని అన్నారు. అయినా, టీడీపీకి ఇలాంటి పరిస్థితులు కొత్తేమీ కాదని, ఎన్నికల తర్వాత చాలామంది పార్టీని వీడారని బొండా ఉమ పేర్కొన్నారు. వంశీ వాట్సాప్ లో తన రాజీనామా లేఖలను పంపడం పట్ల ఆయన స్పందిస్తూ, ఇప్పుడంతా వాట్సాప్, ఫేస్ బుక్కుల్లో రాజీనామాలు చేసే విధానం వచ్చిందని వ్యాఖ్యానించారు.