ఇప్పటి వరకు కార్లు, మోటార్ సైకిళ్లు, ఆటోలు, బోట్ తదితర ప్రయాణ విభాగాల్లో సేవలందిస్తున్న ఉబర్ తాజాగా బస్సు సర్వీసుల్ని కూడా ప్రారంభించాలని భావిస్తోంది. దీనిలో భాగంగా దిల్లీ మెట్రోతో సమన్వయం చేసుకొంటూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫీచర్ను పొందుపరిచిన ఉబర్ యాప్ను ఆవిష్కరించింది. ఢిల్లీ మెట్రో స్టేషన్ల నుంచి లేదా మెట్రో మార్గంలో పబ్లిక్ బస్సులకు సంబంధించిన సమాచారం యాప్లో కనిపించనుండగా ప్రస్తుతానికి ఈ సేవలు కేవలం దేశ రాజధానికే పరిమితం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉబర్ సీఈఓ దాదా ఖోస్రోషాహీ ఇందుకు సంబంధించిన వివరాలు తెలియ చేస్తూ, ఇప్పటికే ఉబర్ బస్సు సేవల్ని ఈజిప్టు రాజధాని కైరోలో అందుబాటులోకి తీసుకొచ్చామని, తాజా యాప్కు వినియోదారుల స్పందన ఆధారంగా మిగతా నగరాలకూ విస్తరించే యోచనలో ఉన్నామని తెలిపారు. పూర్తి స్థాయి ఉబర్ బస్సు యాప్ని ప్రారంభించాలో లేదో యాప్లో వినియోగదారుల స్పందన ఆధారంగా నిర్ణయిస్తామన్నారు.
కాగా యాప్లో ఉన్న వివరాలు ప్రకారం ఒకవేళ పూర్తిస్థాయి యాప్ అందుబాటులోకి వస్తే బస్సు సర్వీసులకు సంబంధించి వినియోగదారులు తమ పికప్, డ్రాపింగ్ పాయింట్లను ఎంపిక చేసుకోవాలి. అయితే, మనమున్న ప్రతిప్రదేశానికి మాత్రం బస్సు రాదు. నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే ఆగుతుంది. అలాగే మనం చేరుకోవాల్సిన ప్రదేశానికి సమీపంలోని ఉబర్ నిర్దేశిత ప్రాంతంలోనే దింపుతారు. ఇక బస్సులన్నింటిలో ఏసీ సౌకర్యం ఉంటుంది. యాప్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్లోని బార్కోడ్ని స్కాన్ చేసి నగదు రూపంలో లేదా యాప్ ద్వారా ఛార్జీ చెల్లించాలి. మన గమ్యస్థానం దగ్గరకు రాగానే మనల్ని అప్రమత్తం చేస్తూ యాప్లో నోటిఫికేషన్స్ వస్తాయి. బస్సు వెళ్లే రూట్లో మనం దిగాల్సిన కచ్చితమైన ప్రదేశాన్ని చూపిస్తుంది. అక్కడి నుంచి మనం చేరుకోవాల్సిన స్థానానికి మార్గం కూడా యాప్లో చూడొచ్చు.