ప్రకృతి సిద్ధంగా వచ్చే వరదలను ఎవరూ ఆపలేరని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. సుజనాచౌదరిని రాజధాని ప్రాంత రైతులు కలిశారు. ఈ సందర్భంగా తమ పోరాటానికి అండగా ఉండాలని రైతులు కోరారు. ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ వరదలు వచ్చాయని రాజధానిని మారుస్తామనడం సరికాదని హితవు పలికారు. రాజధాని అమరావతి విషయంలో జగన్ ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు కాబట్టి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశంగా తెలిపారు. విజయసాయిరెడ్డి చెప్పిన దాంట్లో ఏ మాత్రం నిజం లేదని అన్నారు. వైసీపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోవాల్సిన పనిలేదన్నారు. రాజకీయ కారణాలతో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. అమరావతిలో తనకు ఎలాంటి భూములు లేవని సృష్టం చేశారు. తనకు బినామీలుగా ఉండాల్సిన అవసరం ఎవరికీ లేదని వెల్లడించారు. రాజధాని రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.