ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సామాన్య భక్తులకు ఆమడ దూరంలో కలియుగ శ్రీనివాసుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2019, 08:26 PM

ఏడుకొండలపై కొలువైన కలియుగ దైవం శ్రీనివాసుడు కూడా సామాన్య భక్తులను ఆమడ దూరం నుంచే దర్శించుకోమ్మంటున్నాడు. అదే సంపన్నభక్తులో లేక పలుకుబడి వున్న భక్తులో వస్తే వారి స్థాయిని బట్టి ఇన్నాళ్లు ఎల్-1, ఎల్-2, ఎల్-3 పేరుతో పాటు బ్రేక్ దర్శనాలు కల్పించాడు. ఇలా దర్శనాల కోసం వచ్చే సంపన్నులను కొండపై తిష్టవేసిన కొందరు దళారుల తీవ్ర ప్రభావం చూపుతున్నారు. సంపన్నులకు దర్శనానంతర తీర్థ ప్రసాదాలను కూడా తమ దళారీ వ్యవస్థను అడ్డుపెట్టుకుని కల్పిస్తున్నారు. అయితే వీరి ప్రమేయాన్ని పూర్తిగా నివారించే ప్రయత్నాలను ప్రభుత్వం నడుంచుట్టింది.
దీంతో ఇన్నాళ్లు వున్న ఎల్-1, ఎల్-2, ఎల్-3 పేరుతో పాటు బ్రేక్ దర్శనాలకు పూర్తిగా రద్దు చేసిన టీటీడీ కమిటీ.. ఇక వాటిని కూడా కాసులను రాబట్టేందుకు వినియోగించుకునే పనిలో పడింది. ఆదాయ అన్వేషణలో మరో మెట్టు ఎక్కి ఇది తమ ఘనతేనని, నలభై ఏళ్లు ఇండస్ట్రీలో వున్నా.. ఎన్నాళ్లుగా కొనసాగుతున్నామన్నది కాదు.. ఆదాయం పెంచుకున్నామా.? లేదా? అన్నదే ముఖ్యమని కూడా చాటిచెప్పాలని భావిస్తోంది. అయితే ఏం చేయబోతోందనేగా.. ఇకపై తిరుమలేశుని భక్తులు ఎవరైనా డబ్బును ఆలయానికి విరాళంగా ఇస్తే.. వారికి ప్రత్యేక దర్శనం కల్పించనుంది. అంతేకాదు ముఖ్యమైన సేవా టికెట్లను కూడా కల్పించనుంది. 
అందులో భాగంగా, శ్రీవాణి ట్రస్ట్ ను ప్రారంభించిన టీటీడీ, రూ. 10 వేల విరాళం ఇచ్చే భక్తులకు స్వామి సమక్షంలో తీర్థం, శఠారిలతో కూడిన బ్రేక్ దర్శన సౌకర్యాన్ని కల్పించనుంది. అంతకుమించి విరాళాలు ఇస్తే, ముఖ్యమైన వస్త్రాలంకార, తోమాల, అర్చన వంటి సేవా టికెట్లను ఇవ్వాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. తొలి దశలో రోజుకు 200 టికెట్లను విడుదల చేస్తూ, ప్రయోగాత్మకంగా పరిశీలించాలని, ఆపై భక్తుల ఆదరణను బట్టి, రోజుకు 1000 టికెట్ల వరకూ కేటాయించాలని భావిస్తున్నామని అధికారులు వెల్లడించారు. 
దీంతో రోజుకు కనీసం కోటి రూపాయల చొప్పున ఏడాదిలో రూ. 360 కోట్లకు పైగా ఆదాయాన్ని పొందవచ్చని అంచనా వేస్తున్నారు. త్వరలో టీటీడీ పాలకమండలి ఏర్పడి, ఈ విధానానికి ఆమోదం వేస్తుందని, ఆపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొదలవుతుందని తెలుస్తోంది. కాగా, ఈ విధానంతో ఆదాయం సమకూరే విషయాన్ని పక్కనబెడితే.. తమకు స్వామివారిని దర్శనాన్ని కనీసం 15 సెకన్లు అయినా కల్పించాలని సామాన్యభక్తులు కోరుతున్నారు. కాసులున్న భక్తుల్లా విలాసంగా తాము కొండకు రామని, ఎన్నో వ్యయప్రయాసలు పడి కొండకు చేరుకుంటామని తమను కూడా అటు ప్రభుత్వం, ఇటు ఆలయ కమిటీలు అలకించాలని కోరుతున్నారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com