నకిలీ ఓటరు కార్డులకు చెక్ పెట్టె దిశగా కేంద్ర ఎన్నికల సంఘం అడుగులు వేస్తుంది. దేశంలో రెండు, అంతకన్నా ఎక్కువ ప్రాంతాల్లో ఓట్లు ఉన్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, ఈ పరిస్థితి తొలగాలంటే, ఆధార్ అనుసంధానమే మార్గమని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఇక నుండి కొత్తగా ఓటర్ గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారి నుంచి ఆధార్ నంబర్లను సేకరిస్తామని, ఇప్పటికే గుర్తింపు కార్డులు కలిగిన ఓటర్ల నుంచి ఆధార్ నంబర్లను సేకరించి అనుసంధానం చేస్తామని, ఇందుకు తమకు అధికారాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్నిఈసీ కోరింది. ఇక ఓటరు కార్డులకు ఆధార్ కార్డు వివరాలు అనుసంధానం చేయాలంటే, 1950 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టానికి మార్పులు చేయాలని గుర్తు చేస్తూ, న్యాయశాఖకు ఎన్నికల సంఘం ఓ లేఖను రాసింది. అందులో ఆధార్అనుసంధానం చేస్తే, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటున్న వారిని తొలగించవచ్చని తెలిపింది. దీనితో నకిలీ ఓటర్లకు చెక్ పెట్టొచ్చని తెలిపింది.