కశ్మీర్ వ్యవహారంపై చైనాకు ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ క్లాస్ ఇచ్చారు. కశ్మీర్లో ప్రజాస్వామ్యం అబాసు పాలవుతుందని ఆవేదన చెందే చైనా.. హాంకాంగ్లో చేస్తున్నదేంటని ప్రశ్నించారు. వెయ్యి మంది నిరసనపై ఉన్న పట్టింపు లక్ష మందిపై ఎందుకు లేదని నిలదీశారు. తమ దేశంలో విషయాలు ముందు చక్కబెట్టుకుంటే మంచిదని సూచించారు.
‘‘కశ్మీర్లో ప్రజాస్వామ్యం కావాలంటూ చైనా కోరుకుంటోంది. మరి చైనాలో ప్రజాస్వామ్యం పరిస్థితేంటి? కశ్మీర్లో వెయ్యి మంది నిరసన వ్యక్తం చేస్తే సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. మరి, హాంకాంగ్లో లక్షల మంది రోడ్లపై వస్తే పట్టించుకోవడం లేదెందుకు?’’ అని ఆమె ట్వీట్ చేశారు. తాము చైనాలో కలిసేది లేదని తెగేసి చెబుతూ కొంత కాలంగా హాంకాంగ్ వాసులు లక్షల సంఖ్యలో నిరసన చేస్తున్నారు. అయినప్పటికీ హాంకాంగ్ను తమ దేశంలో కలుపుకునే విధంగా చైనా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.