బావపై వ్యామోహంతో అక్క గర్భవతి అని కూడా చూడకుండా హతమార్చిన ఘటన మధ్యప్రదేశ్లో జబల్పూర్ జిల్లాలోని కైత్రాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం .. అభిలాష(27), షతక్షి(19) అక్కాచెల్లెళ్లు ఉన్నారు. అభిలాషకు వివాహం అయింది. అయితే అభిలాష భర్తపై ఆమె చెల్లి షతక్షి మనసుపడింది. దీంతో బావను ఎలాగైనా దక్కించుకోవాలని, అతన్ని పెళ్లి చేసుకోవాలని మనసులో నిశ్చయించుకుంది. బావతో పెళ్లి కావాలంటే.. అక్కను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. అదునుకోసం వేచి చూస్తూ వచ్చింది. ఇంతలో అభిలాష గర్భవతి కావడంతో పుట్టింటికి వచ్చింది. ఇదే అదునుగా భావించిన షతక్షి.. అభిలాష స్నానానికి వెళ్లగా ఆమెపై కత్తితో విరుచుకుపడింది. మెడపై, కడుపులో విచక్షణా రహితంగా పొడిచేసింది. బాధితురాలు కేకలు పెట్టడంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకొని, రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న అభిలాషను ఆస్పత్రికి తరలించారు. ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు వెల్లడించారు. కాగా, అభిలాషను హత్యచేసిన షతక్షి.. తప్పించుకునేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. షతక్షిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమెపై కేసు నమోదుచేసి రిమాండ్కు తరలించారు.