అన్ని ఆలోచించే అడుగు పెట్టా.. జగన్ ప్రభుత్వంపై ఇప్పుడే మాట్లాడను అని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వెల్లడించారు. మాటిస్తున్నా.. ప్రజా సమస్యలపై జనసేన పోరాడుతుంది.. సుదీర్ఘమైన ప్రయాణం చేయడానికే సిద్ధపడి జనసేన పార్టీ స్థాపించా వెల్లడించారు. ఎన్నికల్లో పరాజయం అనంతరం రివ్యూ మీటింగ్లు నిర్వహించిన పవన్..పార్టీపై దృష్టి పెట్టారు జనసేనానీ. క్షేత్రస్థాయిలో పార్టీని ఎలా బలోపేతం చేయాలి.. ప్రజా సమస్యలపై పోరాటం తదితర విషయాలు చర్చించేందుకు పవన్..2019, జూన్ 24వ తేదీన విజయవాడకు వచ్చారు. ముఖ్యనేతలతో పవన్ భేటీ అయ్యారు. స్టేట్ లెవల్ కమిటీలు వేసేందుకు పార్టీ నిర్ణయించిందన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భవిష్యత్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.
ఇందుకు స్టేట్ లెవల్ కమిటీలను నియమిస్తామన్నారు. ఎవరైతే బలంగా పనిచేశారో..పార్టీ వైపు ఎవరు నిలబడ్డారో.. మున్ముందు నిలబడగలరా..యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లగలరా ? ఆశయాలను తీసుకెళ్లడం..లాంటి తదితర అంశాలను బేరీజు వేసుకుంటామన్నారు. ఇందులో అందరి అభిప్రాయాలను తీసుకొంటున్నట్లు తెలిపారు. 2014 పార్టీ పెట్టిన సమయంలో సుదీర్ఘమైన ప్రయాణం చేయాలని అనుకుని తాను ముందుకు వచ్చినట్లు చెప్పారు.
గతంలో వచ్చిన టీడీపీ ప్రభుత్వ విషయంలో తాను కొంత సమయం తీసుకున్నట్లు గుర్తు చేశారు. ప్రస్తుతమున్న వైసీపీ ప్రభుత్వానికి తగిన సమయం ఇస్తామని..సత్ఫలితమైన పథకాలను స్వాగతిస్తామని..అలాగే ప్రజలకు వ్యతిరేకంగా పథకాలు ఉంటే..బలమైన పోరాటం చేస్తామని పవన్ స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య సున్నితమైన సమస్యలున్నాయని..వీటిపై తాము ఇప్పుడే మాట్లాడబోమని చెప్పారు. తమ కార్యాచరణనను..ప్రణాళికలు..రూపొందించి ముందుకెళుతామన్నారు జనసేనానీ.