రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన బెల్ట్ షాపులపై ఇక కొరడా ఝుళిపించాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు గట్టి ఆదేశాలు జారీచేశారు. గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులు వందకి వంద శాతం తొలగించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బెల్ట్ షాపులను నిర్వహించే మద్యం దుకాణాదారుల లైసెన్స్ లను వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. కఠినమైన చర్యలు తీసుకునే దిశగా టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగాలని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో బెల్ట్ షాపుల తొలగింపుపై ఎక్సైజ్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు.
అక్రమ మద్యం తయారు చేస్తున్న 190 గ్రామాల్లో దృష్టి సారించాలని, దీని తొలగింపునకై తక్షణం చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. బెల్ట్ షాపుల వల్ల ప్రజల ఆరోగ్యాలు, ఆర్థికపరిస్థితి ఛిద్రం అవుతుందని, ముఖ్యంగా యువత పెడద్రోవ పడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. మద్య నిషేధం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇది తొలి అడుగు అని, దశలవారీగా మద్య నిషేధం అమల్లోకి రావాలని ముఖ్యమంత్రి సూచించారు. మద్యం విధానం సమగ్రంగా, సమర్థవంతంగా అమలు చేయడానికి మిగతా రాష్ట్రాల్లో మద్యం విధానాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు తామే.. మద్యం షాపులను నిర్వహించడం ద్వారా బెల్ట్ షాపులను నియంత్రిస్తున్న విధానాన్ని అధికారులు పరిశీలించి త్వరితగతిన నివేదిక అందజేయాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.