తాజా ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్.. వరుస సమీక్షలతో జరిగిన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తోంది. రెండు రోజుల క్రితం రాష్ట్రంలో పర్యటించి పలు వర్గాలతో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ భేటీ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీ మరో ప్రధాన కార్యదర్శి, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్న జ్యోతిరాధిత్య సింధియా పార్టీ నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఆరున్నర గంటల పాటు జరిగిన సుదీర్ఘ సమీక్షానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నాయకులు, కార్యకర్తల నుంచి వచ్చిన సమాచారం మేరకు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని గుర్తించామన్నారు.
ఈ సందర్భంగా రానున్న ఉపఎన్నికల్లో పోటీపై మాట్లాడుతూ.. రెండు వారాల్లో మరో సమావేశం నిర్వహిస్తామని అందులో అభ్యర్థులను ఖరారు చేస్తామని సింధియా తెలిపారు. 2022లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని వెల్లడించారు. ఒంటరిగా పోటీ చేసి పార్టీని బలోపేతం చేసుకుంటామని స్పష్టం చేశారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ ఘోరపరాజయం పాలైన విషయం తెలిసిందే. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా అమేఠీలో ఓడిపోవడం ఆ పార్టీని తీవ్ర నిరాశకు గురిచేసింది.