కృష్ణానది తీరంలో ఉండవల్లి కరకట్ట పక్కన శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమంలో శారదాపీఠ ఉత్తరాధికారి శిష్య సన్యాసాశ్రమ స్వీకార మహోత్సవాలు ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు జరగనున్నాయి. శనివారం నుంచి 3 రోజులుపాటు ఉదయం 8.30 నుంచి రాత్రి 8గంటల వరకూ కార్యక్రమాలుంటాయని నిర్వహకులు ఓప్రకటనలో తెలిపారు. విశాఖ శారదాపీఠానికి ఉత్తరాధికారిగా కిరణ్కుమార్శర్మను నియమించి, పీఠం భావి బాధ్యతలను ఆయనకు అప్పగించనున్న విషయం విదితమే. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలు పీఠాల అధిపతులు, మఠాధిపతులు, సాధు, సంతులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు.
మూడు రోజుల కార్యక్రమాలు వివరాలుఇలా ఉన్నాయి
శనివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు సన్యాసాంగ చతుష్కృత్య ప్రాయశ్చిత్తం, దశవిధ స్నానాలు, కూష్మాండ, పురుషసూక్త, ప్రాజాపత్య, వైశ్వానర హోమాలు, షోడశమహాదానాలు జరిగాయి. రెండో రోజు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు సన్యాసాంగ అష్ట శ్రాద్దాలు, శాస్త్ర, అహితాగ్ని, వాక్యార్ధ మహాసభలు జరుగుతాయి. మూడో రోజు సోమవారం ఉదయం 9 గంటలకు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వైశ్వానర స్థాలీపాకం, విరజాహోమాలు, సావిత్రీ ప్రవిలాపనం, శిఖా, కటిసూత్ర, యజ్ఞోపవీత పరిత్యాగం, ప్రేషోచ్చారణం, కాషాయ, దండ, కమండలలు ధారణ, గురుసమీపగమనం, ప్రణవ, మహావాక్యోపదేశం జరుగుతాయని, అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు శాస్త్ర సభ, అహితాగ్ని సభ, అనంతరం శ్రీప్రాచీన, నవీన గురువందనాలు, తర్వాత జగదుర్గు శ్రీ చరణులచే బాలస్వామి వారికి యోగపట్టా అనుగ్రహం , సాయంత్రం జగద్గురు శ్రీ చరణులు, బాలస్వామివార్ల అనుగ్రహ భాషణం ఉంటుందని, విద్వత్సన్మానం జరగనున్నాయని శారదాపీఠం విడుదల చేసిన ప్రకటనలొ తెలిపింది.