మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసెంబ్లీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శాసనసభ స్పీకర్గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఆయన్ను సభాధ్యక్షుడి కుర్చీలో కుర్చోపెట్టడానికి అధికారపక్షం నుంచి జగన్ హాజరయ్యారు. అయితే, ప్రతిపక్షం నుంచి చంద్రబాబు హాజరుకాలేదు. ఈ విషయంపై పెద్ద దుమారం రేగింది. స్పీకర్కు ప్రతిపక్షం గౌరవం ఇవ్వలేదంటూ వైసీపీ మండిపడింది. స్పీకర్ ఎన్నిక సందర్భంగా తమకు కనీసం సమాచారం ఇవ్వలేదని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అన్నారు. కానీ, స్పీకర్ మీద ఉన్న గౌరవార్థం ప్రతిపక్షం తరఫున అచ్చెన్నాయుడును పంపారు. ఈ అంశంపై మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ‘చంద్రబాబు రాకుండా ఆయన బంట్రోతును పంపారు.’ అంటూ కామెంట్స్ చేశారు. దీనిపై గొడవ జరిగింది. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేను బంట్రోతు అనడం ఏంటంటూ అచ్చెన్నాయుడు అభ్యంతరం తెలిపారు.
‘చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. నేను ఎమ్మెల్యేనా?, బంట్రోతునా చెప్పాలి. నేను చంద్రబాబు బంట్రోతు అయితే, మీ 150 మంది జగన్ బంట్రోతులు.’ అంటూ అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో సభలో అధికార విపక్షాల మధ్య గొడవ జరిగింది. దీనిపై స్పందించిన స్పీకర్ తమ్మినేని సీతారాం.. రికార్డులను పరిశీలించి.. అలాంటి వ్యాఖ్యలు ఉంటే వాటిని తొలగిస్తామని హామీ ఇచ్చారు.