వైసీపీ ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ చేరుకున్న ఆమె.. మీడియాతో మాట్లాడారు. తనను విజయవాడ ఎవరూ రమ్మని పిలవలేదన్నారు. బుధవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండటంతో.. వాటికి హాజరయ్యేందుకే విజయవాడ వచ్చానన్నారామె. తనకు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని ఎవరూ చెప్పలేదన్నారు రోజా. తనకు మంత్రి పదవి దక్కలేదన్న బాధ లేదన్నారామె. మంత్రి పదవి రాకపోవడంతో తాను అలిగానని చెప్పడం.. కేవలం మీడియా సృష్టే అని ఆరోపించారు. కులాల సమీకరణల వల్లే తనకు మంత్రి పదవి దక్కలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల లిస్టులో తాను ఫిట్ అవ్వలేదన్నారు. చిన్నప్పటి నుంచి తాను కులాల్ని ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి కూడా ఆమె ఎందుకు గైర్హాజరయ్యారన్న విషయాన్ని కూడా వెల్లడించారు. మంత్రి పదవులు దక్కించుకున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రిగా ప్రమాణం చేసే వారుంటే చాలు ఇక ఎమ్మెల్యేలెందుకు అన్నారు. అందుకే ఆ కార్యక్రమానికి తాను వెళ్లలేదన్నారు. జగన్ పిలిస్తే తప్పకుండా వెళ్లి కలిసి వస్తానన్నారు రోజా.
అయితే తనకు మంత్రి పదవి దక్కలేదన్న బాధలేదని... రోజా బయటకు అలా చెబుతున్నా.. దీనిపై ఆమె తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. ఎందుకంటే మీడియాతో మాట్లాడినప్పుడు కూడా ఆమె ముఖంలో ఆ బాధ స్పష్టంగా కనిపిస్తోంది.