తమిళనాడు ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై దుకాణాలు, వాణిజ్య సముదాయాలు 24గంటలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం గురువారం గెజిట్ విడుదల చేసింది. రాష్ట్ర కార్మిక శాఖ చేసిన ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదించింది. మూడు ఏళ్ల పాటు ఈ విధానం కొనసాగించనున్నట్టు తెలిపింది. 2016లో కేంద్రప్రభుత్వం దుకాణాలు మరియు విధుల నియంత్రణా మండలి, సేవలకు సంబందించిన నిబంధనల చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టం ప్రకారం సినిమా థియేటర్లు, హోటళ్లు, దుకాణాలు, బ్యాంకులు సహా పలు పరిశ్రమలు వారంలో 7 రోజుల పాటు 24 గంటలు పనిచేయవచ్చు. ఈ చట్టాన్ని అలాగే అమలు చేసుకోవచ్చు లేకపోతే.. స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్చుకోవచ్చని కూడా అందులో పేర్కొంది. దీని ప్రకారం రాష్ట్రాలే తమ పరిధిలోని దుకాణాలు, సంస్థల పని గంటలను నిర్దేశించుకోవచ్చు.