తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డుతో సహా ఆంధ్రప్రదేశ్ రాఫ్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాల పాలక మండళ్ల రద్దు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం మారినప్పుడు పాలక మండలి సభ్యులు రాజీనామాలు చేయటం ఆనవాయితీ అయినా కొందరు ఇందుకు ససేమిరా అనటంతో ఎలాంటి న్యాయపరమైన సమస్యలు రాకుండా చట్టప్రకారం క్యాబినెట్ ఆమోదం ద్వారా పాలక మండళ్ల రద్దు చెయ్యాలని జగన్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. పాలక మండళ్లను రద్దు చేసినట్లు నోటీసులు ఇస్తే కోర్టును ఆశ్రయించే అవకాశం ఉండటంతో, దేవాదాయశాఖ చట్టం 1987లోని సవరణ ద్వారా ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకు రావాలని పార్టీలోని సీనియర్ మంత్రుల సలహాని పాటిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆర్డినెన్స్ జారీ చేయాల్సిన పక్షంలో ఇందుకు క్యాబినెట్ ఆమోదం తప్పనిసరి కావడంతో, 8 తేదీన మంత్రి వర్గం ఏర్పాటు రోజునే దానిని క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి దీనిని ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. పాలకమండళ్ల రద్దు ఆర్డినెన్స్ ను క్యాబినెట్ ఆమోదించిన వెంటనే గవర్నర్ కు పంపాలని , ఇది కుదరని పక్షంలో 12 న అసెంబ్లీ సమావేశాల్లో సవరణ బిల్లు పెట్టి తద్వారా పాలక మండళ్ల రద్దుకు నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.