అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం సేకరించిన భూముల అక్రమాలపై విచారణ జరిపించాలని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి జగన్ను కోరారు. ఈ మేరకు జగన్కు కన్నా లక్ష్మీనారాయణ ఏడు పేజీల లేఖ రాశారు. రాజధాని భూముల అక్రమాలు, అసైన్డ్ ల్యాండ్ కొనుగోలులో అక్రమాలపై విచారణ జరిపించాలని, రైతులకు న్యాయం చేయాలని కన్నా కోరారు. గత ప్రభుత్వం తెచ్చిన ఉచిత ఇసుక విధానంపై పునరాలోచన చేయాలని, ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేలా కొత్త పాలసీ తీసుకు రావాలని ఆయన సూచించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో నిర్వాసితులు, గిరిజనులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో తొలగించిన హిందూ దేవాలయాలను పునర్నిర్మించాలని, పెండింగ్లో ఉన్న చుక్కల భూముల సమస్యలను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అగ్రిగోల్డ్ అవినీతిపై సిబిఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.