చెల్లి ఎస్టీ కానప్పుడు ఆమె అక్కమాత్రం ఎస్టి అవుతుందా? అంటూ సరికొత్త అభ్యంతరాలు ఆరంభించారు విజయనగరం బిజెపి నేతలు. ఈ మేరకు ఎస్టీ రిజర్వుడు స్థానమైన విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన పాముల పుష్పశ్రీవాణి కుల విషయమై విచారణ చేయాలని.. బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ డిమాండ్ చేశారు.ఎన్నికల్లో పోటీకి నిలబడే అభ్యర్థులు తాజాగా తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలనే నిబంధన ఉన్నా పుష్పశ్రీవాణి 2013లో తీసుకున్న ధ్రువీకరణ పత్రాన్నే నామినేషన్ సమయంలో సమర్పించారని, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎలా ఆమోదించారని ప్రశ్నించారు.
ప్రస్తుత శాసనసభ్యురాలు పుష్పశ్రీవాణి సోదరి పాముల రామతులసి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన అనంతరం.. ఆమె ఎస్టి కాదని అప్పటిలో పార్వతిపురం ఐటీడీఏ పీవో విచారణ చేసి నిర్ధారించిన విషయాన్ని ఎందుకు అధికారులు పరిగణలోకి తీసుకోవటంలేదో అర్ధం కాని ప్రశ్న అని, ఇలాంటి బినామీ గిరిజనుల మూలంగా అసలైన గిరిజనులకు అన్యాయం జరుగుతుందని గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై న్యాయపరమైన పోరాటానికి బిజెపి సిద్దమవుతున్నట్టు ఆయన చెప్పారు.