రెండో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రధాని మోడీ ప్రత్యేక విమానంలో రానున్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు. ఈనెల 9న సాయంత్రం 4గంటలకు ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారని, తదుపరి రోడ్డు మార్గంలో నేరుగా తిరుమల చేరుకుంటారని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధానికి స్వాగతం పలికేంద్ర భారీగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తిరుపతికి తరలి రావాలని కోరారు. మరోవైపు ప్రధాని పర్యటనకు సంబంధించి పిఎంఓ నుంచి సమాచారం అందటంతో తిరుపతి- తిరుమల మార్గంలో అత్యంత కీలక ప్రాంతాలలో పూర్తి స్ధాయిలో భద్రతా ఏర్పాట్లపై అధికారులు సమీక్షించారు. పలు చోట్ల నడకదారి, రోడ్డు మార్గం కలిసే చోట్ల ప్రతి భక్తుడిని పూర్తిగా పరిశీలించాకనే కొండపైకి అనుమతించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. కాగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధానికి స్వాగతం తెలిపేందుకు ఎపి సిఎం జగన్ పార్టీ శ్రేణులను కూడా సమాయుత్తం చేస్తున్నట్టు సమాచారం.